వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు మంత్రి ఆర్కే రోజా. పవన్ చేసిన వ్యాఖ్యల్లో వుమెన్ ట్రాఫికింగ్ అనే ఆరోపణ తనకు నచ్చలేదన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్లపై వ్యాఖ్యలు సరికాదని.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని రోజా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని.. సీఎం జగన్ను కూడా చులకన చేసి మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి వాలంటీర్లను చూసి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వణుకుతున్నారని అందుకే వారిపై విషం చిమ్ముతున్నారని రోజా మండిపడ్డారు.
అన్న మాటలకు పవన్ కల్యాణ్ వాలంటీర్ల కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో వాళ్లే నీ అంతు తేలుస్తారని రోజా హెచ్చరించారు. పవన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, వాటికి కూడా క్లారిటీ లేదని.. వుమెన్ ట్రాఫికింగ్ కోసం వాలంటీర్లు పనిచేస్తున్నారా అని ఆమె మండిపడ్డారు. వుమెన్ ట్రాఫికింగ్లో ఏపీ టాప్ 10లో లేదని.. తెలంగాణనే ఆరో స్థానంలో వుందని కేసీఆర్ను ప్రశ్నించగలవా అని రోజా నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడగలవా.. నీ మక్కెలు ఇరగ్గొడతారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ తల్లి, భార్యను, పిల్లలను వైసీపీని తిడుతున్నారని పవన్ అంటున్నారని.. కానీ టీడీపీ పెద్దలే మీ కుటుంబాన్ని తిట్టారని రోజా గుర్తుచేశారు.
నీ అభిమానులను, నీ కోసం పని చేసే వారిని బాలకృష్ణ ఫ్యాన్స్ తిట్టారని.. కానీ ఆయన ఇంటర్వ్యూకు పిలవగానే ఎలా వెళ్లావని ఆమె ప్రశ్నించారు. ప్యాకేజ్ కోసం నీ కుటుంబాన్ని, జనసైనికులను తిట్టిన వారిని వెనకేసుకొస్తున్నావా అంటూ రోజా మండిపడ్డారు. జగన్ను విమర్శించే స్థాయి నీకు లేదని.. ఆయన ఎప్పుడైనా నీ కుటుంబాన్ని విమర్శించారా అని ఆమె నిలదీశారు. చంద్రబాబు హయాంలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ వెలుగు చూసినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని ఆమ ప్రశ్నించారు. ఆ సమయంలో నీ నోరు హెరిటేజ్ ఐస్క్రీమ్తో నిండిందా అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read More :
టాలీవుడ్ నన్ను బాగా చూసుకోంది.. కానీ కోలీవుడ్లో ఆ హీరో మాత్రం : నిత్యా మీనన్ హాట్ కామెంట్స్