టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూత

News

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇకలేరు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు విశాఖ నుంచి వస్తుండగా వడదెబ్బకు గురైన రాకేష్ మాస్టర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించి రక్ష విరేచనాలు సైతం చేసుకున్నారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్ రామారావు. హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన ఆయన తర్వాత కొరియోగ్రాఫర్‌గా మారారు. లాహిరి లాహిరి లాహిరిలో, చిరునవ్వుతో, దేవదాసు, సీతయ్య ఇలా దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఆయన శిష్యులే కావడం విశేషం. వయోభారం, తదితర కారణాలతో సినిమాలకు దూరంగా వుంటున్న రాకేష్ మాస్టర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా వుంటారు. ఏ విషయంపైనైనా, ఎవరి పైనైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడతారు రాకేష్. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *