ఫలక్నూమా దాస్, పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సూపర్ హిట్లతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇటీవల టీవీ 9 యాంకర్తో జరిగిన వివాదంతో విశ్వక్ సేన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై హైప్ నెలకొంది. నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నారు..? ఎలాంటి కథను ఎంచుకున్నారు అంటూ యూత్ ఇంటర్నెట్ను జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తర్వాతి చిత్రంపై ఓ వార్త వైరల్ అవుతోంది.
సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించబోతున్నారట. ఈ చిత్రాన్ని అర్జున్ స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారట. ఇందులో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటించనున్నారు. ఒక జర్నీ నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఆదివారం ప్రకటించారు.
అర్జున్ నటుడిగానే కాకుండా… దర్శకుడిగానూ విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఈ నేపథ్యంలోనే విష్వక్సేన్ని విభిన్నమైన పాత్రలో చూపించనున్నారు. ఆసక్తికరమైన కలయికలోని ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇతర నటులు, సాంకేతిక బృందం వివరాల్ని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇందులో సీనియర్ నటుడు, అర్జున్ మిత్రుడైన జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్పై టాలీవుడ్లో అంచనాలు నెలకొన్నాయి.