ప్రస్తుతం ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు పవన్ కల్యాణ్. తాజాగా ఆయన వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి తోడు జగన్ను ఏకవచనంతోనే పిలుస్తానని.. ఇకపై ఆయనకు గౌరవం ఇవ్వనని పవన్ తేల్చిచెప్పారు. దీంతో ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ను గట్టిగా టార్గెట్ చేశారు. ఇదే ఇప్పుడు సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.
పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన ‘బ్రో’ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మోడ్రన్ దేవుడిలా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తమిళంలో హిట్టైన ‘వినోదయ సీతమ్’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ‘‘బ్రో’’ తెరకెక్కింది. ఆల్రెడీ అక్కడ సినిమా హిట్ కాబట్టి తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రెండు మూడు బిట్ సాంగ్స్ పెండింగ్ లో ఉన్నాయని సంగీత దర్శకుడు తమన్ ఇటీవల తెలిపాడు. వాటి మిక్సింగ్ వర్క్ తప్పించి ఓవరాల్గా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఏపీలో అధికార పార్టీ ఎలాంటి కష్టాలు పెడుతుందో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్ రేట్లు తగ్గించేసి ఓపెనింగ్స్పై దెబ్బ కొట్టడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై పవన్ కారాలు మిరియాలు నూరుతూ వుండటంతో దీని ఎఫెక్ట్ ‘‘బ్రో’’పై వుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ‘బ్రో’ సినిమా టికెట్ రేట్ల పెంపు అనేది ఉండదని అవసరమైతే ఇంకా తగ్గించేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఫిలింనగర్ టాక్. అలాగే బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలు ఉండవు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా ‘బ్రో’కి ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఓపెనింగ్స్ పై దెబ్బ పడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఒక్క పవన్ కళ్యాణ్ కోసం మొత్తం సినీ పరిశ్రమని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది జగన్ ప్రభుత్వం. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్ గెలిస్తే.. పవన్ కళ్యాణ్కి మాత్రమే కాకుండా సినీ పరిశ్రమకి మరిన్ని కష్టాలు తప్పవనే అభిప్రాయాలూ వినిపిస్తూనే ఉన్నాయి.
Read More :